వైయస్ జగన్ వర్గాన్ని దూరం పెట్టేందుకే కమిటీ ఏర్పాటు నిలిపివేత?
పైకి కనిపిస్తున్న కారణాలు అవే అయినా యూత్ కాంగ్రెసు వ్యవహారాలు చూస్తున్న రాహుల్ గాంధీ ప్రమేయంతోనే వాటిపై స్టే విధించినట్లు అనుమానిస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షుల నియామకాన్ని నిలిపేసినట్లు యూత్ కాంగ్రెసు జాతీయ ప్రధాన కార్యదర్శి నితిన్ శర్మ, అధ్యక్షుడు రాజీవ్ సాతో చెప్పారు. పూర్తి సమాచారం తీసుకుని దీపావళి తర్వాత నియామకాలు చేపడుతామని వారు చెప్పారు. సుధాకర్ బాబు అధ్యక్షుడిగా ఉంటారని వారు చెప్పారు. పార్టీ కోసం పనిచేసేవారిని విస్మరించబోమని వారు స్పష్టం చేశారు. అయితే, వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొన్నవారిని, జగన్ కు సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి వారిని కమిటీలకు దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం.
వైయస్ జగన్ అనుచరులు ఉన్నారు కాబట్టే రాష్ట్రంలోని యూత్ కాంగ్రెసు కమిటీలను రద్దు చేశారని గతంలో వైయస్ జగన్ అనుచరుడు అంబటి రాంబాబు విమర్శించారు. అటువంటి స్థితిలో మళ్లీ వైయస్ జగన్ కు చెందినవారినే నియమించడంలో అర్థం లేదని రాహుల్ గాంధీ భావించినట్లు సమాచారం. కమిటీపై స్టే విధించినట్లు చెబుతున్నప్పటికీ దాన్ని రద్దు చేసినట్లేనని భావిస్తున్నారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ సారథిగా టి.జె.ఆర్.సుధాకర్బాబును కొనసాగిస్తూ యువజన కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 38 మందితో పాటు 23 జిల్లాల అధ్యక్షులు, 13 మంది నగర అధ్యక్షుల పేర్లను యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి జ్యోతిమణి న్యూఢిల్లీలో మంగళవారం ప్రకటించారు. పలు జిల్లాల్లో జగన్ వర్గానికి చెందినవారికే పట్టం కట్టినట్లు వార్తలు వచ్చాయి.