కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు దద్దమ్మలు, స్వార్థపరులు: చిరంజీవి
ఉభయగోదావరి జిల్లాల్లో కుండపోత వర్షాలతో బాగా నష్టపోయింది కౌలు రైతులేనని వారికి ప్రజారాజ్యం పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత చిరంజీవి భరోసా ఇచ్చారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలో అతివృష్ఠి బాధితులను చిరంజీవి పరామర్శించారు. కౌలు రైతులకు ప్రభుత్వ సాయం అందడం లేదని, ఈ విషయాన్ని వారం క్రితమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వారిని ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అది నెరవేరేలా ప్రజారాజ్యం పార్టీ కృషి చేస్తుందన్నారు. డ్రెయిన్లు పూడికలు, ఆక్రమణలతో నిండిపోవడంతో రైతులు వర్షాలు, వరదలు వచ్చిన ప్రతిసారీ తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. డెల్టా ఆధునికీకరణకు నిధులు ఉన్నా అవినీతి కారణంగా పనులు సరిగా జరగడం లేదని చిరంజీవి ఆరోపించారు. ప్రకృతి రైతులపై కక్షగట్టి వెంటాడుతుంటే వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.
ఖరీఫ్లో తడిచిన ధాన్యానికి పూర్తి మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని, వర్ష బాధితులకు 50కేజీల బియ్యం, 10 లీటర్ల కిరోసిన్ అందివ్వాలని చిరంజీవి డిమాండ్చేశారు. ఆదివారం ఉదయం గౌతమీ ఎక్స్ప్రెస్లో కాకినాడ చేరుకున్న చిరంజీవి కాకినాడ గ్రామీణం, సామర్లకోట, పిఠాపురం తదితర మండలాల్లో పర్యటించారు. కాకినాడ ఆర్ అండ్ బి అతిథిగృహంలో జిల్లాలో పంట నష్టాలపై ఏర్పాటుచేసిన ఫొటో ప్రదర్శన తిలకించారు. సామర్లకోట మండలం, వి.కె.రాయపురంలలో పంటలను పరిశీలించారు. సీడిగ, సర్పవరం, గొల్లప్రోలు మండలంలోని బీసీ కాలనీలోని ఇళ్లను పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.