కె చంద్రశేఖర రావుపై దుమ్మెత్తి పోసిన దేవేందర్ గౌడ్
కాంగ్రెసు పార్టీ ఎజెండాను అమలు చేసే దళారీగా కెసిఆర్ పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రావతరణ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెసు తెలంగాణను మోసం చేస్తోందని, తెలంగాణ ప్రజలను మభ్య పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటోందని, తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను నెరవేర్చడం లేదని, స్వార్థ రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకుని తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని ఆయన అన్నారు. కెసిఆర్ ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం కాకుంటే రెచ్చగొట్టి 600 మంది విద్యార్థుల చావుకు ఎందుకు కారణమయ్యావని ఆయన కెసిఆర్ ను ప్రశ్నించారు.
కాంగ్రెసు, కెసిఆర్ కలిసి చేస్తున్న కుట్రను అర్థం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. తమ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే ఎవరు బలపరుస్తారో, ఎవరు వ్యతిరేకిస్తారో తేలిపోతుందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా, ఆర్థికంగా బలపడడమే కెసిఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ పై తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతం మరో నాయకుడు కడియం శ్రీహరి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ ను నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు.