హోంమంత్రి రాజీనామా చేయాలి: ఓయు విద్యార్థుల డిమాండ్
హోంమంత్రి సబితారెడ్డి సీమాంధ్ర నాయకుల తొత్తుగా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ వారికి న్యాయం చేయలేని సబితారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సాయంత్రం మంత్రి సబితారెడ్డి ప్రకటన వెలువడిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని వారు చెప్పారు. 15 రోజులుగా శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. తెలంగాణ వారికి అడిగే హక్కు లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నదన్నారు. లాఠీలు, తుపాకీలు మాకు కొత్తకాదని, మేం చావడానికైనా సిద్ధమని ప్రకటించారు. ఎంతమంది మరణించినా వెనక్కి తగ్గేది లేదన్నారు.
ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, డిజిపి అరవిందరావు హైదరాబాదును ఫ్రీజోన్ గా ఉంచాలని కుట్ర పన్నుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సపోర్టు చేయకుంటే వారి ఇళ్లముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ మంత్రులకు చీము నెత్తురు ఉంటే వెంటనే సీమాంధ్రులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, తెలంగాణకు అన్యాయం చేస్తున్న డిజిపిని బర్తరఫ్ చేయించాలని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో డిజిపి చిచ్చుపెడుతున్నాడన్నారు. రోశయ్య ముఖ్యమంత్రా లేక రోబోనా అని అడిగారు. పోలవరంపై తదితర విషయాలపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే ప్రభుత్వం ఈ విషయంపై సైతం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు. ముఖ్యమంత్రి వెనుక ఉండి భజన చేస్తున్న మంత్రులు రాజీనామా చేయాలన్నారు.