రోశయ్య అసహనం, కామెంట్స్: రెచ్చిపోయిన ఒయు విద్యార్థులు
"ఎస్సై ఉద్యోగాల కోసం అష్టకష్టాలు పడిన వాళ్లున్నారు. శారీరక పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. శిక్షణ తీసుకుంటున్న పేదవాళ్లున్నారు. అలాంటి పేద అభ్యర్థులకు, ప్రభుత్వానికి హుస్సేన్సాగర్లో ఖాళీ ఉందిగా.." అంటూ ముఖ్యమంత్రి రోశయ్య వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 'హైదరాబాద్ ఫ్రీజోన్" అంశంపై గురువారం సాయంత్రం హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఫ్రీజోన్ వివాదంతో ఎస్సైల రాత పరీక్ష వాయిదా వేస్తే పేద అభ్యర్థుల భవిష్యత్తు ఏమి కావాలని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సీఎం స్పందనిది.
రాష్టప్రతి ఉత్తర్వుల్లోని 14 ఎఫ్ నిబంధన తొలగించడానికి ఎంతకాలం పడుతుందన్న మరో ప్రశ్నకు.."నాకు జోస్యం తెలియదు. ఎంతకాలం పడుతుందో నాకు తెలియదు. నేను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిని కాదు. రాష్ట్రానికి ఇది కావాలని కేంద్రాన్ని కోరడం తప్ప, శాసించలేం. అయినా వాళ్లకు (కేంద్రానికి) ఒక విధానం అంటూ ఉంటుంది. 14 ఎఫ్ను ఆలస్యం చేయమని నేను కోరతానా? అలాంటి బుద్ధితక్కువ పని చేయను. 2014 ఎన్నికల్లో నిన్ను (ప్రశ్న అడిగిన విలేకరిని చూపిస్తూ) పార్లమెంట్కు పంపి ప్రధానమంత్రిని చేస్తాం. అప్పుడు నీవు చెబుదువుగాని ఎంత సమయం పడుతుందో. నీ అంత తెలివితేటలు అందరికీ లేవు. మేము చిన్న వాళ్లం" అంటూ మరోసారి వ్యంగ్యంగా మాట్లాడారు.
14 ఎఫ్ తొలగింపులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విపక్షాలతోపాటు మీ పార్టీ ఎంపీలు కూడా అంటున్నారు కదా అన్న మరో ప్రశ్నకు స్పందిస్తూ.. "ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే వారికే చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్, కమ్యూనిస్టు, బీజేపీ, ఈ ఇస్టు..ఆ ఇస్టు ఎవరన్నా..వాళ్లకే చిత్తశుద్ధి లేదు" అని ఒకింత ఘాటుగా స్పందించారు. "పరీక్ష వాయిదా వేయాలంటున్నారు. అంటే ఇదివరకు నిర్వహించిన పరుగు పందెం, దేహదారుఢ్య పరీక్షలు అన్నీ మళ్లీ నిర్వహించాలనా?" అని సీఎం ఎదురు ప్రశ్నించారు.