ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు
తనకు 1972లోనే పెళ్లయిందని, బంజారాలను ఎస్టీలో చేరుస్తూ పార్లమెంటు సైతం 2003లోనే బిల్లును ఆమోదించిందని ఆలాంటప్పుడు తన ఎన్నిక ఎలా చెల్లదని ఆమె అన్నారు. తమకు న్యాయం జరగనందున పైకోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాడుతామన్నారు. సుమన్ రాథోడ్ భర్త, అదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు రమేశ్ రాథోడ్ హైకోర్టు తీర్పుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. న్యాయం జరగలేదని పై కోర్టుకు వెళతామని చెప్పారు. కాగా తెదేపా సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు కూడా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు.
2008లో తెలుగుదేశం పార్టీ తరఫున సుమన్ రాథోడ్ ఖానాపూర్ నుండి పోటీ చేసి గెలిచారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి శాసనసభకు పోటీ చేసిన జోగి నాయక్ తమ్ముడు హరినాయక్ కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఖానాపూర్ నియోజకవర్గం ఎస్టీలకు కేటాయించారని, తెదేపానుండి పోటీ చేసి గెలిచిన సుమన్ రాథోడ్ ఎస్టీ కాదని ఆమె ఎన్నిక రద్దు చేయాలని ఆయన పిల్ దాఖలు చేశారు. ఆ తీర్పు సోమవారం వెలువడింది.