కడప ఎంపీ జగన్ మౌనంపై అనుమానాలు: దామోదర్ రెడ్డి
సాక్షి ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేసిన సుధాకర్ ను చంపుతామని బెదిరింపు కాల్ వచ్చిందని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని దామోదరరెడ్డి డిమాండ్ చేశారు. ఆ కాల్ వెనుక ఉన్న వారెవరో విచారణ జరిపించాలన్నారు. సోనియా గాంధీని జగన్ విమర్శిస్తే సీమాంధ్రులు ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మన్మోహన్ సింగును సైతం సోనియా రబ్బరు స్టాంపు అనటంపై ఎవరూ స్పందించలేదని ఇదేనా సీమాంధ్రులు కాంగ్రెసు పార్టీకి ఇచ్చే విలువా అని ప్రశ్నించారు. సాక్షి కథనాలపై జగన్ సమాధానం చెప్పాలన్నారు.
సోనియాగాంధీకి అనుకలంగా ఉంటే చంపేస్తామని బెదిరిస్తారా అన్నారు. ఆయన వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోనియా వెంట తెలంగాణ కాంగ్రెసు అంతా ఉందని ఆయన చెప్పారు. క్రమశిక్షణ లేని వాళ్లు పార్టీలో నుండి వెళ్లి పోవాలన్నారు. కొత్త పార్టీ పెడుతున్నారనే వార్తలు వస్తున్నాయని దానిపై జగన్ వెంటనే స్పందించాలన్నారు. జగన్ మౌనం కూడా అనుమానాలకు దారితీస్తుందని అన్నారు. జగన్ వద్ద అక్రమంగా సంపాదించిన ఆస్తులు టాటాలకు మించి ఉన్నాయన్నారు. సోనియాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎవ్వరిపైనైనా రాళ్లేస్తామని హెచ్చరించారు.