వైయస్ జగన్ ఇష్యూ: లోకేష్ స్టూడియోఎన్ చానెల్ కు పండుగ
కాంగ్రెసు భారీ కుంభకోణాల్లో ఇరుక్కుపోయిందన్న జగన్ కు సంబంధించిన సాక్షిలో వచ్చిన కథనాన్ని ఆధారంగా స్టూడియో ఎన్ ఇటు జగన్ వర్గాన్ని, అటు కాంగ్రెసు లక్ష్యంగా పనిచేస్తుంది. కేంద్రంలో కాంగ్రెసు ప్రభుత్వానికి కష్టాలు వచ్చినప్పుడు కాంగ్రెసు అధిష్టానానికి పార్లమెంటు సభ్యులను కొనుగోలు చేసే దుస్సాంప్రదాయం ఉందని తెలిపింది. కాంగ్రెసు పార్టీలోనే ఉన్న జగన్ సైతం ఇప్పుడు కాంగ్రెసు దుస్సాంప్రదాయంలోనే వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పింది. ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి భారీగా డబ్బులు పెట్టి శాసనసభ్యులను కొనుగోలు చేసే అవకాశం ఉందంటున్నది. రాష్ట్ర శాసనసభలో పార్టీకి, రోశయ్యకు పూర్తి అనుకూలంగా 74 మంది ఉండగా, అటు ఇటు కాకుండా 70 మంది ఉన్నారని, జగన్ వర్గానికి మాత్రం 12 మంది మాత్రమే పూర్తి సహకారం అందించే అవకాశాలు ఉన్నాయని, 70 మందిలో కొందరికి డబ్బులు ఆశ చూపి తనవైపు తిప్పుకునే అవకాశముందని చెప్పింది.
అందుకోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నది. కర్ణాటకలో కూడా జగన్ కు అత్యంత సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అయిన గాలి జనర్ధన్ రెడ్డికి సైతం అలాంటి కొనుగోలు సాంప్రదాయం ఉందని తెలిపింది. ఇందులో భాగంగా జగన్ వర్గానికి సంబంధించిన అంబటి రాంబాబుతో ఇంటర్వ్యూ కూడా చేసింది. జగన్ ను పార్టీ నుండి వెళ్లగొట్టాలని రాష్ట్ర కాంగ్రెసు లోని కొందరు సీనియర్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని అంబటి ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. జగన్ పార్టీనుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నాలేమీ చేయటం లేదని విహెచ్ లాంటి వాళ్లే సోనియా వద్ద జగన్ కు వ్యతిరేకంగా కథనాలు సృష్టిస్తున్నారన్నారు.
20 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నానని ఎప్పుడు కాంగ్రెసు ప్రభుత్వం పడిపోలేదని, అయితే ముఖ్యమంత్రులు మారే అవకాశముందని అంబటి అన్నారు. కాంగ్రెసు ప్రజాస్వమ్య పార్టీ అని పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తుందని అందువల్లనే జగన్ ను బయటకు పంపించదని తాను ఖచ్చితంగా చెప్పగలనని ఆయన చెప్పారు.