ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అప్పుడే తెలంగాణ సెగ
కాంగ్రెస్ అధిష్టానం ఇస్తానన్నప్పటికీ డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని తెలంగాణకు చెందిన నాయకులు తీసుకోవద్దని కాకతీయ విశ్వవిద్యాలయ ఐక్య కార్యచరణ సమితి హెచ్చరించింది. తెలంగాణకు చెందిన శాసనసభ్యులు ఎవరు కూడా మంత్రి పదవులు స్వీకరించవద్దని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. వారు పదవులు స్వీకరిస్తే ఉద్యమానికి తీవ్రంగా నష్టం జరిగే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణకు చెందిన మాజీ మంత్రి గీతారెడ్డి, దామోదర రాజనర్సింహారెడ్డిలలో ఎవరో ఒకరిని ఉప ముఖ్యమంత్రి పదవి వరిస్తుందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
కాగా సీమాంధ్ర నేత అయిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సంచనల వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇష్యూ ఇష్యూగానే మిగిలి పోతుందని అన్నారు. పొలిటికల్ సెటిల్మెంట్ కోసమే ముఖ్యమంత్రిని మార్చారన్నారు. యనమల సమైక్యవాది కావడం గమనించదగ్గ విషయం. టీడీపీని ఎవరూ దెబ్బ కొట్టలేరన్నారు. మొదట యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన కిరణ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. రోశయ్యను అవమానకర స్థితిలో సాగనంపారని ఆయన అధిష్టానాన్ని తప్పుబట్టారు.