వైయస్ జగన్ పై చర్యకు సోనియా గాంధీకి ఎందుకీ తొందర?
వైయస్ జగన్ వ్యవహార శైలిపై, బలంపై స్పష్టమైన అంచనా రావడంతో చర్యలకు పూనుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వాన్ని నిరంతరం గందరగోళంగా నడిపించే కన్నా స్పష్టమైన చర్యల ద్వారా మార్గం ఏర్పాటు చేసుకోవాలని భావించినట్లు సమాచారం. వైయస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని భావించిన వీరప్ప మొయిలీనీ పార్టీ అంధ్రప్రదేశ్ వ్యవహారాల నుంచి చెప్పాపెట్టకుండా తప్పించి గులాం నబీ ఆజాద్ కు అప్పగించారు. దీంతో వైయస్ జగన్ పై చర్యలకు మార్గం మరింత సులభమైందని అంటున్నారు.
వైయస్ జగన్ తో రహస్యంగా భేటీ అయిన శాసనసభ్యులు 18 మందికి మించి లేకపోవడం, సిఎల్పీ సమావేశంలో వారు నోరు మెదపకపోవడం సోనియాకు ధైర్యాన్ని ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రభుత్వాన్ని కూల్చే శక్తి లేదని పార్టీ అధిష్టానం స్పషమైన అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ తమ మార్గంలోకి వచ్చే సూనలు కనిపించడం లేదు. ఆయన సొంత పార్టీ పెట్టేందుకే మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయానికి వచ్చినట్లు భావిస్తున్నారు. దీంతో వైయస్ జగన్ పై చర్య తీసుకోవడమే సరైందనే భావనకు సోనియా వచ్చినట్లు చెబుతున్నారు.