తిరుగుబాటుకే సిద్ధపడుతున్న వైయస్ జగన్ క్యాంప్
వైయస్ జగన్ పై చర్య తీసుకుంటుందని తాము అనుకోవడం లేదని, వైయస్ జగన్ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించలేదని వారన్నారు. రోశయ్యను గానీ కిరణ్ కుమార్ రెడ్డిని గానీ నేతగా అధిష్టానం నేతగా ఎంపిక చేసిన సమయంలో వైయస్ జగన్ వర్గానికి చెందినవారని చెబుతున్న శాసనసభ్యులెవరూ వ్యతిరేకించలేదని గట్టు రామచందర్ రావు అన్నారు. సాక్షి మీడియా వార్తాకథనాలతో వైయస్ జగన్ కు సంబంధం లేదనే వారంతా ఇప్పటికీ వాదిస్తున్నారు. సాక్షి వార్తాకథనాలను పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంటోందనే వార్తలు వస్తున్నా అదే వాదనకు వారు కట్టుబడి మాట్లాడుతున్నారు. మంత్రి పదవి తీసుకోవడానికి అంగీకరించిన వైయస్ జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిపై వారు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రి పదవి తీసుకోవాడనికి కూడా ఆంగీకరించబోనని చెప్పారు. తనకూ కిరణ్ కుమార్ రెడ్డికీ మధ్య వ్యక్తిగత విభేదాలు లేవని ఆయన అన్నారు. తనను మంత్రివర్గంలోకి తీసుకుంటారని అనుకోవడం లేదని, తాను ఆశించడం కూడా లేదని ఆయన చెప్పారు. ఆదినారాయణ రెడ్డి వంటి ఒకరిద్దరు తప్ప మంత్రి పదవుల కోసం వైయస్ జగన్ వర్గానికి చెందినవారెవరూ ఎదురు చూడడం లేదు.