కొత్త ముఖ్యమంత్రితో మారుతున్న సీన్: ఆత్మరక్షణలో వైయస్ జగన్
ప్రస్తుత పరిస్థితుల్లో తాము మరింత వేగంగా వ్యూహరచన చేయాల్సిన అవసరముందని జగన్ శిబిరం అంచనాకు వచ్చినట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం జగన్ ఇంట్లో ఆయనతో మంతనాలు సాగించిన ఎమ్మెల్యేలు కూడా సాయంత్రం లేక్వ్యూ అతిథిగృహానికి వెళ్ళి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. కిరణ్ రాక తమ వర్గం ఉనికికే ప్రమాదమన్న జగన్ భావనల్ని కూడా పక్కనపెట్టి వీరంతా ఆయన వద్దకు వచ్చి మాట్లాడి వెళుతున్నారు. జగన్ వర్గీయులుగా భావిస్తున్న తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేలు రెండు రోజులుగా కిరణ్ను రోజుకు నాలుగైదు సార్లు కలుస్తున్నారు. తామంతా పార్టీకి విధేయులమేనని, 2014లోనూ కాంగ్రెస్లోనే ఉంటామని జగన్ శిబిరంగా భావిస్తూ వచ్చిన ఎమ్మెల్యేలు రెండురోజులుగా తెగేసి చెబుతున్నారు. కిరణ్ను కలసి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. కిరణ్ ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల్లో, క్యాడర్లోను వచ్చిన ఉత్తేజం తమకు అవాంఛనీయ పరిణామంగా జగన్ శిబిరం భావిస్తోంది. తమ బలంగా భావిస్తూ వచ్చినదంతా కిరణ్ రాకతో జారిపోవడం ప్రారంభమయిందనే ఆందోళన ఆ శిబిరంలో కనిపిస్తోంది.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు వల్ల తాము బలహీనపడ్డామనే భావన కలగకూడదని జగన్ భావిస్తున్నారు. రాయలసీమ నుంచి, అందునా అదే ప్రధాన సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతను ఎంచుకోవడం ద్వారా అధిష్ఠానం తమకు గట్టి సవాల్ విసిరిందనే అభిప్రాయం జగన్ వర్గంలో ఏర్పడింది. ముఖ్యమంత్రిగా కిరణ్ ప్రమాణం చేసిన కొద్ది గంటల్లోనే జగన్ హైదరాబాద్కు చేరుకోవడమే అందుకు నిదర్శనం. శుక్రవారం ఉదయం ఆయనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు, నేతలతో ఇంటి వద్ద సందడి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. బంజారాహిల్స్లోని కొత్త ముఖ్యమంత్రి ఇంటి వద్ద, ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్న లేక్వ్యూ అతిథిగృహంలో పెద్దఎత్తున హడావుడి ఉంటోంది. ఆ మార్గ మధ్యంలోనే జగన్ తన ఇంటి వద్ద ఒకరకంగా అసమ్మతి క్యాంపు తరహా వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నంచేశారు. ఈ స్థితిలో అసమ్మతి కార్యకలాపాలే ఆయుధంగా చేసుకోవాలనే ఆలోచనలో జగన్ వర్గం ఉన్నట్లు సమాచారం.