వైయస్ జగన్ ముఖ్య నేతలు వీరే: రేపు హైదరాబాదులో కార్యాచరణ
ప్రస్తుత స్థితిలో వైయస్ జగన్ వెంట ఉండే ముఖ్యనేతలు దాదాపుగా ఖరారైనట్లే. అంబటి రాంబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కొండా సురేఖ, భూమా నాగిరెడ్డి, జక్కంపూడి రామ్మోహన్ రావు, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, రోజా, పుల్లా పద్మావతి, గోనె ప్రకాశ రావు వంటి నేతలే ఆయనకు ప్రధానమైనవారు. లక్ష్మిపార్వతి వైయస్ జగన్ పార్టీలోకి వస్తారా, లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి వైయస్ జగన్ వైపు వస్తారా, లేదా చూడాల్సి ఉంది. ముగ్గురో, నలుగురో పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్ వెంట వెళ్తారని అంటున్నారు. కానీ, ఏ మేరకు వారు జగన్ వెంట వెళ్తారనేది చెప్పడం కష్టమే. వీరికి తోడు, శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, కమలమ్మ, శ్రీనివాసులు, ఆదినారాయణ రెడ్డి వంటి కొంత మంది శాసనసభ్యులున్నారు. వైయస్ జగన్ వెంట ఉండే శాసనసభ్యుల సంఖ్య పది నుంచి పదిహేను వరకు ఉంటుందని అంటున్నారు. వారందరినీ కాంగ్రెసు అధిష్టానం ఇప్పటికే గుర్తించింది. వారిని కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గం నుంచి దూరం పెట్టింది.
తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీ నుంచి శాసనసభ్యులను కూడా లాగాలనే ఉద్దేశంతో వైయస్ జగన్ వర్గం ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ రేపు గురువారం హైదరాబాదు వస్తున్నారు. తన కొత్త పార్టీపై ఆయన ఇప్పటికే పులివెందులలో, కడపలో తన సన్నిహితులతో మాట్లాడారు. రేపు గురువారం హైదరాబాదులో తన వర్గానికి చెందిన ముఖ్యనేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. జిల్లాల్లో ఎక్కడికక్కడ వైయస్ జగన్ వర్గానికి చెందినవారు సమావేశమై వ్యూహరచన చేసుకుంటున్నారు. మరోవైపు, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ మంత్రివర్గ కూర్పుపై, పార్టీ అధిష్టానంపై దుమ్మెత్తి పోయడమే పనిగా వైయస్ జగన్ వర్గీయులు పెట్టుకున్నారు. వైయస్ వివేకానంద రెడ్డిని కుట్ర చేసి తమవైపు లాక్కుని వైయస్సార్ కుటుంబంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాదాపు అన్ని చానెళ్లలో బుధవారం జగన్ వర్గీయులే కనిపించారు.