వెనక్కి తగ్గుతున్న అసంతృప్త మంత్రులు: సిఎం బుజ్జగింపు యత్నాలు
అయితే ఉదయానికల్లా మంత్రుల్లో క్రమంగా మార్పు వచ్చింది. తనకు ఏ శాఖ అయినా ఫరవాలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదన్నారు. ఏ శాఖనైనా సక్రమంగా నిర్వహిస్తానన్నారు. రాంరెడ్డి వెంకటరెడ్డి సైతం తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తితో ఉన్నప్పటికీ తాను రాజీనామా చేయనన్నారు. కాసు వెంకటకృష్ణారెడ్డి తనకు అసంతృప్తి ఉన్నప్పటికీ కొనసాగుతానని ప్రకటించారు. మరోవైపు వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య నాకు అసంతృప్తి ఉందని మీకు చెప్పానా అంటూ మీడియాపైనే రుసరుసలాడారు. మీ ఇష్టం వచ్చినట్టు నేను నడుచుకోవాలా అంటూ ఆగ్రహించారు.
అసంతృప్తులు అంతా కాంగ్రెస్ అధిష్టానం రావాలని డిమాండ్ చేస్తున్నారు. అహ్మద్ పటేల్ ముఖ్యమంత్రికి ఫోన్ చేశారు. దాంతో ముఖ్యమంత్రి వారిని బుజ్జగించే ప్రయత్నాల్లో మునిగిపోయారు. శాఖల కేటాయింపు అసంతృప్త మంత్రులను కలిసి మాట్లాడిన తర్వాత నేను ఏదైనా మాట్లాడుతానని ప్రస్తుతానికి ఏమీ మాట్లాడనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విలేకరులతో గురువారం అన్నారు. అసంతృప్తి తొందరలోనే సమసిపోతుందన్నారు.