కొంత మందికి ఊహించని శాఖలు: తొలిసారే పంట పండింది
2004 నుంచి వైద్య, ఆరోగ్యశాఖను వైద్యం, ఆరోగ్యశ్రీ, వైద్యవిద్యల పేరుతో మూడు ముక్కలు చేసి ముగ్గురికి కేటాయించగా ఇప్పుడు మూడింటిని కలిపి డి.ఎల్.రవీంద్రారెడ్డికి అప్పగించారు. 1989లో ఈయన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం కడప జిల్లాకున్న రాజకీయ ప్రాధాన్యం దృష్ట్యా కడప జిల్లాకు రెండు కీలక శాఖలు లభించాయి. మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రిగా పనిచేసిన ఆనం రామనారాయణరెడ్డికి, వ్యవసాయ మంత్రిగా పనిచేసిన రఘువీరారెడ్డికి అత్యంత కీలకమైన ఆర్థిక, రెవిన్యూ శాఖలు లభించాయి. రఘువీరారెడ్డి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడ్డారు. మోపిదేవి వెంకటరమణకు ఎక్సైజ్ శాఖ లభించింది. ఇటీవలివరకు ఆరోగ్యశ్రీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పితాని సత్యనారాయణకి కీలకమైన, అత్యధిక బడ్జెట్ కలిగిన సాంఘిక, సంక్షేమ శాఖను కేటాయించారు.
కొత్తగా మంత్రివర్గంలో చేరిన బస్వరాజు సారయ్యకి మరో కీలక ప్రాధాన్యమున్న బీసీ సంక్షేమ శాఖ లభించింది. గతంలో చిన్నతరహా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సునీతా లక్ష్మారెడ్డికి మెరుగైన మహిళా, శిశుసంక్షేమం లభించింది. దీంతోపాటు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చే స్వయం సహాయక సంఘాల వ్యవహారాలు చూసే ఇందిర క్రాంతిపథం(ఐకేపీ) సైతం ఆమెకే కేటాయించారు. ఐకేపీ గతంలో గ్రామీణాభివృద్ధి శాఖలో భాగంగా ఉండేది. సీనియర్ మంత్రి జానారెడ్డికి గ్రామీణ నీటి సరఫరాతో కూడిన పంచాయతీరాజ్ శాఖ దక్కింది. గతంలో గ్రామీణ నీటి సరఫరాకు వేరే మంత్రి ఉండేవారు. సబితకు మళ్ళీ హోం శాఖ దక్కించుకుని పట్టు నిలుపుకున్నారు. సీఎంకు సన్నిహితంగా ఉండే శ్రీధర్బాబుకు పౌర సరఫరాల శాఖతోపాటు శాసనసభా వ్యవహారాల శాఖనూ కేటాయించారు. ఉప ముఖ్యమంత్రి హోదా లభిస్తుందనే ప్రచారం లభించిన దామోదర్ రాజనర్సింహకి ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలు లభించాయి. గతంలో ఇవి రెండూ వేర్వేరుగా ఇద్దరు మంత్రులు పర్యవేక్షించారు.
ఉప ముఖ్యమంత్రి స్థాయికి తగినట్లు ఉండాలన్న ఉద్దేశంతో రెండింటినీ కలిపినట్లు కనిపిస్తోంది. సీనియర్ మంత్రి గీతారెడ్డి కీలకమైన భారీ పరిశ్రమలతోపాటు చక్కెరశాఖ దక్కింది. కొత్తగా మంత్రివర్గంలో చేరిన శైలజానాథ్కి సైతం ప్రాథమిక విద్యశాఖతో కొంతమేర ప్రాధాన్యం లభించింది. గతంలో మంత్రులుగా వ్యవహరించి, ఇప్పుడూ స్థానాలు నిలబెట్టుకున్న మంత్రుల్లో కొందరికి పాత శాఖలే లభించాయి. ఈ జాబితాలో సబితా ఇంద్రారెడ్డి, బాలరాజు, అహ్మదుల్లా తదితరులున్నారు. వీరిలో అహ్మదుల్లాకి గతంలో మైనారిటీ సంక్షేమ శాఖతోపాటు విద్యకు సంబంధించిన ఒక విభాగమూ ఉండేది. ప్రస్తుతం మైనారిటీ వ్యవహారాలకే పరిమితం చేశారు.