చంద్రబాబు వల్లే బతికి ఉన్నా, నేను హీరోనే: మద్దెలచెర్వు సూరి
ఫాక్షనిజం వల్ల తాను ఎంతో నష్టపోయానని, తన వాళ్లందర్నీ కోల్పోయి తన భార్యతో పాటు ప్రస్తుతం బెంగళూర్ లో ఉంటున్నానని ఆయన చెప్పుకున్నారు. రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్ర -2లో కొన్ని అభ్యంతరకరమైన దృశ్యాలు ఉన్నాయని, వాటిని తొలగించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన అన్నారు. టీవీ బాంబు కేసులో హంతకుడు పరిటాల రవి అని, అయితే రక్తచరిత్ర -2లో పరిటాల రవిని ఈ విషయంలో హీరోగా చూపించారని, ఆ సంఘటనతో పరిటాల రవికి సంబంధం ఉందనే విషయం చెప్పలేదని ఆయన అన్నారు. తాను పరిటాల రవిని హత్య చేయలేదని, జైల్లో ఉన్న తాను పరిటాల రవిని ఎలా హత్య చేస్తానని ఆయన అన్నారు. పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మొద్దు శీనును తాను టీవీలోనే చూశానని ఆయన అన్నారు.
తాను ఎవరితోనూ రాజీ పడాల్సిన అవసరం లేదని, పరిటాల రవి హత్య కేసు నుంచి బయటపడిన తర్వాత భవిష్యత్తు కార్యక్రమంపై ఆలోచన చేస్తానని, ఇప్పుడే తాను రాజకీయాల గురించి ఆలోచన చేయబోనని ఆయన చెప్పారు. ఓబుల్ రెడ్డి రేపిస్టు కాడని ఆయన అన్నారు. రామ్ గోపాల్ వర్మను ఒక్కసారే కలిశానని, రక్తచరిత్ర -2కు తాను ఇన్వెస్టర్ ను కానని ఆయన చెప్పారు. రక్త చరిత్ర సినిమా ద్వారా తానే హీరో అయ్యానని ఆయన చెప్పుకున్నారు. అయితే అభ్యంతరకరమైన దృశ్యాలను తొలగిస్తేనే తాను హీరోను అవుతానని ఆయన అన్నారు. మొత్తంగా సినిమా బాగుందని ఆయన చెప్పారు. రామ్ గోపాల్ వర్మ అక్కడక్కడ కొన్ని కల్పితాలు మినహాయిస్తే వాస్తవాలే సినిమాలో చూపించారని ఆయన అన్నారు.