విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బంగాళాఖాతంలో అల్పపీడనం: కోస్తాంధ్రలో భారీ వర్షాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Heavy Rains
విజయవాడ: కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఈ వర్షాలు పడుతున్నాయి. పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. అవనిగడ్డ మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండడంతో వేల ఎకరాల్లో వరిపంట నేలకొరిగింది. గుడివాడ, మచిలీపట్నం డివిజన్లలో వేలాది ఎకరాల్లో వరిపన్నలు తడిసి ముద్దవుతున్నాయి. విజయవాడలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోనూ రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది.

రాజమండ్రి, అమలాపురం, కాకినాడలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముమ్మిడివరం నియోజకవర్గంలో భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు జిల్లాలోనూ విస్తారంగా జల్లులు పడుతున్నాయి. పెన్నా వారధికి మళ్లీ గండి పడింది. దీంతో నీరు వృథాగా సముద్రంలోకి పోతోంది. గుత్తేదారు పనులు ప్రారంభించి వదిలేసిన ప్రాంతంలో కాపర్‌ డ్యాం వద్ద గండి పడింది. సోమవారం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పనులు వదిలేసిన ప్రాంతంలో గండి పడింది.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరానికి సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరుగా, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తెలంగాణలో జల్లులు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X