బంగాళాఖాతంలో అల్పపీడనం: కోస్తాంధ్రలో భారీ వర్షాలు
రాజమండ్రి, అమలాపురం, కాకినాడలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముమ్మిడివరం నియోజకవర్గంలో భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు జిల్లాలోనూ విస్తారంగా జల్లులు పడుతున్నాయి. పెన్నా వారధికి మళ్లీ గండి పడింది. దీంతో నీరు వృథాగా సముద్రంలోకి పోతోంది. గుత్తేదారు పనులు ప్రారంభించి వదిలేసిన ప్రాంతంలో కాపర్ డ్యాం వద్ద గండి పడింది. సోమవారం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పనులు వదిలేసిన ప్రాంతంలో గండి పడింది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరానికి సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరుగా, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తెలంగాణలో జల్లులు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.