జగన్ పార్టీపై మంత్రుల మాట ఒక్కటే: రెహ్మాన్ మాట మరోటి
125 ఏళ్ల కాంగ్రెసు పార్టీలో ఎన్నో పార్టీలు పుట్టి అంతరించిపోయాయని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జగన్ పార్టీతో కాంగ్రెసు కు ఎలాంటి నష్టం లేదన్నారు. నాకు కేటాయించిన శాఖపై అసంతృప్తి లేదన్నారు. ధృడసంకల్పంతో పనిచేసి శాఖకు వన్నే తెస్తా, ప్రభుత్వానికి పేరు తెస్తానని అన్నారు. జగన్ పార్టీతో కాంగ్రెసు కు ఎలాంటి నష్టం లేదని శాసనమండలి సభ్యుడు జనార్ధన్ రెడ్డి అన్నారు. అందరూ సమష్టిగా కష్టపడితేనే రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. జగన్ను కాంగ్రెసు పార్టీ ఏనాడూ అవమానించలేదన్నారు. ఆయన పార్టీ విధివిధానాలు ప్రకటించిన తర్వాత కాంగ్రెసు కు జరిగే నష్టాన్ని చెప్పవచ్చన్నారు.
కాగా జగన్ పార్టీకోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని మాజీ శాసనమండలి సభ్యుడు రెహ్మాన్ అన్నారు. ముస్లిం వర్గాలు జగన్ పార్టీని బలపరుస్తాయన్నారు. అన్ని పార్టీలనుండి జగన్ పార్టీలోకి రావడానికి ఎదురు చూస్తున్నారని చెప్పారు. జగన్ పార్టీ పెట్టాక గల్లీ నుండి ఢిల్లీ దాకా కాంగ్రెసు నష్టమేనని చెప్పారు. కాంగ్రెసు ను ప్రజలు 50 ఏళ్లు మరిచిపోతారన్నారు.