కృష్ణా జిల్లా సీనియర్ల చర్చ: వైయస్ జగన్ వైపా, కాంగ్రెసు వైపా?
కాగా, సమావేశం తర్వాత మండలి బుద్ధప్రసాద్, ఉదయభాను చేసిన ప్రకటనలు మాత్రం వీరు జగన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుపుతున్నాయి. అయితే దేవినేని నెహ్రూ మాత్రం ఆ వార్తలను ఖండించారు. తాము కాంగ్రెసు పార్టీని వీడిపోయే ప్రసక్తి లేదని, తాజా రాజకీయాలపై మాత్రమే విస్తృతంగా చర్చించామని నెహ్రూ చెప్పారు. వైయస్ జగన్ వైపు వెళ్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఈ నెల 16వ తేదీన తన నియోజకవర్గం జగ్గయ్యపేట కార్యకర్తలతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానని మాజీ శాసనసభ్యుడు ఉదయభాను చెప్పారు. జగన్ వైపు వెళ్లాలా, వద్దా అనే విషయంపై సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని, తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
కాగా, రైతు సమస్యలపై ఎవరు పోరాటం చేసినా మద్దతిస్తానని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు రైతు సమస్యలపై పోరాటానికి తాను మద్దతిచ్చినట్లు ఆయన తెలిపారు. వైయస్ జగన్ పార్టీ నుంచి వెళ్లిపోవడం కాంగ్రెసుకు సవాలేనని ఆయన అన్నారు. వైయస్ జగన్ రాజకీయం సంక్షోభం సృష్టిస్తుందని ఆయన చెప్పారు. మొత్తం మీద, శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత జగన్ వైపు వెళ్లాలా, పార్టీలో ఉండాలా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలని వారు అనుకున్నట్లు సమాచారం.