కేంద్ర ప్రభుత్వం అవినీతిపై దేశవ్యాప్త ఆందోళన: చంద్రబాబునాయుడు
జాతీయ నాయకులతో చర్చ అనంతరం బాబు మాట్లాడారు. 2 జి స్పెక్ట్రంపై ప్రభుత్వం జెపిసి వేయకుండా కాలాయాపన చేస్తుందని చంద్రబాబు అన్నారు. కాలాయాపన ఎందుకు చేస్తుందో ప్రధానమంత్రి మన్మోహన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం అవినీతిపై రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కమ్యూనిస్టు పార్టీలతో కలిసి జాతీయస్థాయిలో ఉద్యమాన్ని చేపడతామన్నారు. పెట్రో ధర పెంపు సామాన్య ప్రజల నడ్డి విరిచినట్లేనన్నారు. పెట్రో ధరలు పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు.
భావసారుప్యంగల పార్టీలతో కలిసి కేంద్ర ప్రభుత్వం అవినీతిపై పోరాటం చేస్తామని ప్రకాశ్ కరత్ అన్నారు. 2జి కుంభకోణంపై జెపిసి వేయాల్సిందేనని ఆయన అన్నారు. జేపిసి వేయకపోవడానికి గల కారణాలు ప్రధాని చెప్పాలన్నారు. కేంద్రం పారిశ్రామికవేత్తల కొమ్ము కాస్తుందన్నారు. ప్రభుత్వంలో కూడా పారిశ్రామిక వేత్తలు ఉన్నారని ఆరోపించారు.