మరోసారి పెరిగిన పెట్రోల్ ధర: త్వరలో డీజిల్ ధర కూడా హెచ్చింపు
రెండో అతిపెద్ద కంపెనీగా ఉన్న బీపీసీఎల్ పెట్రోలు ధరలను సవరిస్తూ ముందుగా తన నిర్ణయాన్ని ప్రకటించింది. బీపీసీఎల్ ఢిల్లీలో ఇక నుంచి పెట్రోలును లీటరుకు రూ.55.86 చొప్పున విక్రయిస్తుంది. అతిపెద్ద ఆయిల్ కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), మరో కంపెనీ- హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్)లు బుధవారం ఇదే స్థాయిలో పెంపుదలను ప్రకటిస్తాయి. పెట్రోలు ధరలను ఒకేసారి పెంచడం వల్ల కంపెనీలు కుమ్మక్కయ్యాయన్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు అవి ఒకటొకటిగా నిర్ణయాలను ప్రకటిస్తున్నాయి. క్రూడాయిల్ ను దిగుమతి చేసుకున్న ధర కంటే తక్కువకు పెట్రోలును విక్రయిస్తున్నందున కంపెనీలు లీటర్కు రూ.4.17 చొప్పున నష్టపోతున్నాయి. డీజిల్పై రూ.2 పెంచేందుకు కంపెనీలు ఈ మేరకు ప్రతిపాదించాయి. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై ప్రణబ్ముఖర్జీ నేతృత్వంలోని మంత్రుల సాధికార బృందం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నెల 22న జరిగే మంత్రుల సమావేశంలో డీజిల్పై నిర్ణయం తీసుకుంటారు. దిగుమతి రేటు కంటే తక్కువకు విక్రయిస్తున్నందున డీజిల్పై ప్రస్తుతం లీటర్కు రూ.5.40ను కంపెనీలు నష్టపోతున్నాయి.
గత నవంబరు 9న లీటర్ కు పెట్రోలు ధరను 32 పైసలు పెంచారు. దీంతో ఢిల్లీలో పెట్రోలు ధర లీటర్ రూ.52.91 అయింది. ప్రభుత్వం నియంత్రణను ఎత్తివేసిన జూన్ 26 నుంచి..ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలు నాలుగుసార్లు ధరలను సవరించాయి. అప్పట్లో (జూన్ 26) క్రూడాయిల్ బారల్ ధర 73-74 డాలర్లు ఉండగా, ఇపుడది 90 డాలర్లకు చేరుకుంది. నియంత్రణలను ఎత్తివేసిన తర్వాత నుంచీ తాజా పెంపుదలతో కలుపుకుని చూస్తే పెట్రోలు ధర లీటర్కు రూ.4.43 చొప్పున పెరిగింది. సోమవారం భారత్ క్రూడాయిల్ ను 89.34 డాలర్లకు కొనుగోలు చేసింది. డిసెంబరు నెలలో సరాసరిన ఈ ధర 88.47 డాలర్లుగా ఉంది. రేట్లను పెంచకపోతే...ఈ ఆర్థిక సంవత్సరాంతానికి మూడు ఆయిల్ కంపెనీలకు డీజిల్, ఎల్పీజీ, కిరోసిన్లకు ఇస్తున్న రాయితీ వల్ల రూ.67 వేల కోట్ల నష్టం వస్తుంది. 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ పై రూ.272.19, లీటర్ కిరోసిన్ పై రూ.17.72 చొప్పున ఆయిల్ కంపెనీలకు నష్టం వస్తోంది.