దీక్ష విరమణపై మొండికేస్తున్న చంద్రబాబు: బాలయ్య పరామర్శ
చంద్రబాబు ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ఆరుగురు వైద్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసినట్లు నిమ్స్ డైరక్టర్ పీవీ రమేష్ తెలిపారు. ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించటంతోపాటు ఆరు గంటలకు ఓ సారి వైద్య పరీక్షలు చేస్తున్నామని రమేష్ తెలిపారు. ఘనాహారం తీసుకోకుండా ఎక్కువసేపు దీక్ష కొనసాగించటం మంచిది కాదని ఆయన అన్నారు. నిమ్స్ ఎమర్జెన్సీ వార్డులో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోగ్యం క్షీణించిందని నిమ్స్ వైద్యులు తెలిపారు. దీక్ష కొనసాగించినా కనీసం ఫ్లూయిడ్స్ తీసుకోవాలని తాము కోరామని అందుకు కూడా ఆయన నిరాకరించారని వైద్యులు తెలిపారు.
నిమ్స్లో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును కలిసి ఆయనకు మద్దతు తెలిపేందుకు ఈరోజు నిజామాబాద్నుంచి పెద్దసంఖ్యలో రైతులు తరలివచ్చారు. వీరంతా నిమ్స్ వద్దకు రాగా వారిని లోపలకు వెళ్లనివ్వలేదు. పోలీసులతో వాగ్వాదం అనంతరం వారు నిమ్స్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. దీంతో ప్రతి నిముషం రద్దీగా ఉండే ఈ రోడ్డులో భారీగా ట్రాఫిక్ స్థంభించింది. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారు.