తెదేపా సచివాలయ ముట్టడి ఉద్రిక్తం: ఎమ్మెల్యేలు సహా పలువురి అరెస్టు
కార్యకర్తలు కాంగ్రెసు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు వెంటనే సరియైన సాయం అందించాలన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం వెంటనే దిగి పోవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సాయం అందించామన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె నియమించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రైతుల సమస్యల పట్టడం లేదన్నారు. ఏ రైతుల పేరు చెప్పి గద్దెనెక్కారో ఆ రైతులు వీరిని గద్దె దింపడానికి సిద్ధంగా ఉందన్నారు.
ముందుగా వెళ్లిన శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకరరావు సహా మరికొందరు కార్యకర్తలు సచివాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నాలు చేశారు. వారి యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు సచివాలయం ముందు బైఠాయించారు. మరికొందరు ముఖ్యమంత్రి బ్లాక్ ముందు కూర్చున్నారు. తెదేపా, వామపక్షాల ముట్టడి ఉండటంతో ప్రభుత్వం ముందుగానే భారీగా పోలీసులను మోహరించింది.