ముందే ఉద్యమంలోకి తెలంగాణ కాంగ్రెస్, రేపటినుండి గన్ పార్కు వద్ద దీక్ష
విద్యార్థులపై కేసులు ఎత్తివేసే వరకు సోమవారం నుండి గన్ పార్కు వద్ద రిలే నిరాహార దీక్షలు చేయనున్నట్లు చెప్పారు. త్వరలో తెలంగాణ కోసం తెలంగాణ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పార్లమెంటు సభ్యులు సర్వే సత్యనారాయణ, పొన్నం ప్రభాకర్, మంత్రి శంకర్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని అందరికీ సూచించారు. తెలంగాణ కోసం పోరాడేవాళ్లంతా పార్టీలకతీతంగా మావాళ్లేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె కేశవరావు అన్నారు. అన్ని పార్టీలను కలుపుకొని తెలంగాణ కోసం పోరాడుతామని చెప్పారు.కేంద్ర బలగాలను మోహరించడాన్ని కూడా వారు ఖండించారు. రేపు ముఖ్యమంత్రిని కూడా కలవనున్నట్లు చెప్పారు.తెలంగాణ కోసం సోనియాపై కూడా ఒత్తిడి తీసుకు వస్తామని చెబుతున్నారు.ప్రభుత్వానికి కేసులు ఎత్తివేసే ఉద్దేశ్యం ఉన్నట్టు లేదన్నారు.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాను సమర్థిస్తూనే తెలంగాణకోసం పోరాడుదామని శాసనమండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీని కాపాడుకుంటూ ఉద్యమిద్దామని సూచించారు. ముందే రాజీనామాలు అనవసరమని, అయితే రాజీనామా లేఖలు అందరి వద్దనుండి ముందుగానే తీసుకొని అవసరమైనప్పుడు ఇద్దామని చెప్పారు.మొత్తానికి తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మిగిలిన పార్టీలకన్నా ముందుగానే ఉద్యమంలోకి వెళ్లాలని భావిస్తున్నాయి. ఎంపీలు రాజీనామాలపై ఘాటుగానే స్పందించినట్టు తెలుస్తోంది. అవసరమైతే మంత్రులే ఉద్యమానికి నాయకత్వం వహించాలని వారు సూచించారు.