రాష్ట్రాన్ని విభజిస్తారా, లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న: శ్రీకృష్ణ
తాము నివేదికలో పలు ఆప్షన్లు ఇచ్చామని, లాభనష్టాలను కూడా తెలియజేశామని ఆయన చెప్పారు. తమకు అప్పగించిన పనిని సమర్థంగా నిర్వహించామని ఆయన అన్నారు. అన్ని విషయాలను తాము పరిగణనలోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. రాష్టాన్ని విభజిస్తారా, లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న అని ఆయన అభిప్రాయపడ్డారు. నివేదిక అంశాలను ప్రభుత్వమే వెల్లడిస్తుందని ఆయన చెప్పారు.
తమ నివేదిక సిద్ధమైందని, నివేదిక చాలా పెద్దదని, ఎన్ని పేజీలు అన్నది ఇప్పుడే చెప్పలేమని, అది ప్రచురణలో ఉందని, అయితే నివేదికలో రెండు అధ్యాయాలున్నాయని, మొదటి అధ్యాయానికి రెండో అధ్యాయం కొనసాగింపు అని శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ వివరించారు. తమకు సహకరించిన మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితే ఉంటుందని విశ్వసిస్తున్నామని ఆయన అన్నారు.
తెలంగాణలో పోలీసు, కేంద్ర బలగాలను దించడంపై ప్రశ్నించగా, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకునే ముందు జాగ్రత్త చర్య మాత్రమేనని, నివేదిక అంశాలను దృష్టిలో పెట్టుకుని దించారని అనుకోవడానికి లేదని ఆయన సమాధానమిచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఓ చరిత్ర ఉందని, 1969, 1972 ఉద్యమాలను చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతుందని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలు పర్యటించామని, వంద సమావేశాలు నిర్వహించామని దుగ్గల్ చెప్పారు. తాము వృత్తిపరమైన బాధ్యతతో, నిష్పాక్షికంగా నివేదికను రూపొందించామని ఆయన చెప్పారు. తాము అన్ని రాజకీయ పార్టీల నాయకులతో మాట్లాడామని, వారంతా ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటున్నారని శ్రీకృష్ణ కమిటీ సభ్యురాలు రవీంద్ర కౌర్ అన్నారు.