శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటుందా?
తెలంగాణకు పూర్తి సానుకూలుడైన మధు యాష్కీ కాస్తా నిరాశతో మాట్లాడారు. తెలంగాణలో కేంద్ర బలగాలను పెద్ద యెత్తున దించడాన్ని బట్టి కూడా తెలంగాణకు కమిటీ నివేదిక ప్రతికూలంగా ఉండవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉంటుందని తెలుగుదేశం గుంటూరు జిల్లా నాయకుడు కోడెల శివప్రసాద రావు మంగళవారం అన్నారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కూడా బుధవారం గుంటూరులో అదే ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజకీయ నాయకుల అభిప్రాయాలు కూడా తెలంగాణకు వ్యతిరేకంగానే శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీపై తమకు నమ్మకం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మొదటి నుంచీ చెబుతూ వస్తున్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో వెనకబడిన ప్రాంతాల అభివృద్దికి ప్రణాళికలను సిద్దం చేయాలని సూచించడం కూడా అదే అభిప్రాయాన్ని బలపరుస్తోంది.
అయితే, ఎఐసిసి అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ మాటలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని, చిన్న రాష్ట్రాల ఏర్పాటు కూడా వ్యతిరేకం కాదని తాజాగా బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అయితే, కాంగ్రెసు నాయకుల మాటల్లో అర్థాలు ఎన్నో ఉంటాయి. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని కాంగ్రెసు నాయకులు మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అయిన దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కూడా అదే మాట చెప్పారు.
అందువల్ల షకీల్ అహ్మద్ మాటలను పూర్తిగా విశ్వసించడానికి లేదు. అయితే, శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎలా ఉన్న నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు, నాయకులు ఏ మేరకు ఒత్తిడి పెడతారనేదానిపై పరిస్థితిలో మార్పు ఉండవచ్చు. తాము రాజీనామాలకు కూడా సిద్ధపడుతామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు చెబుతున్నారు. కానీ, వారు మాట నిలబడతారనే నమ్మకం లేదు.