చంద్రబాబుకు మరో తెలంగాణ షాక్: తెరాసలోకి ముగ్గురు ఎమ్మెల్యేలు
మరో ఇద్దరు శాసనసభ్యులు సుద్దాల దేవయ్య, వేణుగోపాలాచారి కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పోచారం శ్రీనివాస రెడ్డిని బుజ్జగించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. పార్టీ సీనియర్ నేత టి. దేవేందర్ గౌడ్ ఆదివారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. పోచారం శ్రీనివాస రెడ్డికి నచ్చజెప్పడానికే ఆయన జిల్లాలో పర్యటించినట్లు చెబుతున్నారు. అయితే, దేవేందర్ బుజ్జగింపులు పనిచేయలేదని తెలుస్తోంది. దీంతో సోమవారం మరో సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి రంగంలోకి దిగారు. పోచారం శ్రీనివాస రెడ్డిని నివారించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయినా పోచారం శ్రీనివాస రెడ్డి వినడం లేదని తెలుస్తోంది.
ఈ ముగ్గురు శాసనసభ్యులే కాకుండా మరో పది మంది దాకా ఇదే బాట పట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణపై చంద్రబాబు వైఖరికి నిరసనగా, కాంగ్రెసు నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వారు శాసనసభా సభ్యత్వాలకు కూడా రాజీనామాలు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తమ తమ నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ మొత్తం తెరాసలోకి మళ్లిన నేపథ్యంలో, గత ఉప ఎన్నికల్లో తమ పార్టీకి వందల ఓట్లు కూడా పోల్ కాని స్థితిలో వారు పార్టీ నుంచి తప్పుకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.