భాను కిరణ్ గ్యాంగ్ వెనక మంత్రి కుమారుడు కార్తిక్ రెడ్డి?
భాను కిరణ్ ముఠా సూరి పేరుతో సెటిల్మెంట్లు చేస్తూ వచ్చిందని తెలుస్తోంది. ఈ సెటిల్మెంట్ల వ్యవహారంపై సూరి భాను కిరణ్ను పలు మార్లు హెచ్చరిస్తూ వచ్చాడు. తన ప్రమేయం లేదని, తన పేరు మీద డబ్బులు వసూలు చేస్తున్నారని సూరి జైల్లో ఉన్నప్పుడు చాలా సార్లు చెప్పాడు. ఖమ్మం జిల్లాలో భానుకు గన్ లైసెన్స్ ఇప్పించింది కూడా కార్తిక్ రెడ్డేనని అంటున్నారు. ఈ సెటిల్మెంట్ల వ్యవహారంలో సూరి నుంచి తమకు ప్రమాదం తప్పదని భావించిన భాను, మధుసూదన్ కలిసే సూరిని మట్టుబెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇందులో సూరి మరో అనుచరుడు వాసుదేవ రెడ్డి పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్నారు. వాసుదేవ రెడ్డి జూబ్లీహిల్స్ కారు బాంబు కేసులో నిందితుడు. మధుసూదన్ పోలీసులతో చెప్పిన విషయాలు పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. అయితే, సూరి హత్య వ్యవహారంలో మంత్రి కుమారుడు కార్తిక్ రెడ్డి పాత్ర ఉందని చెప్పలేమని, అయితే తమకు అతని అండ ఉందనే దీమా మాత్రం భానుకు ఉండవచ్చునని ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ వ్యాఖ్యానించింది.