నమ్మినబంటు భాను కిరణ్ చేతిలోనే మద్దెలచెర్వు సూరి హతం
కారు నడుస్తూ ఉన్నప్పుడు ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి మెడ వెనుక భాగంలో బయట్నుంచి కాల్పులు జరపడం సాధ్యంకాదు. మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు అతి దగ్గర నుంచి కాల్చినట్లు నిర్ధారించారు. వీటన్నింటినీ విశ్లేషించిన పోలీసులు కారులో వెనుక కూర్చున్న వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కచ్చితమైన అంచనాకు వచ్చారు. అన్నింటికీ మించి ఘటన జరిగిన ప్రాంతంలో చుట్టుపక్కల ఎవరికీ దీని గురించి తెలియకపోవడం గమనార్హం. ఒకవేళ బయటి వ్యక్తులే కాల్పులు జరిపి పారిపోయి ఉంటే తుపాకీ శబ్దం కొందరికైనా వినిపించి ఉండేది. కాల్పులు జరిగిన ఐదు గంటల సమయంలో రోడ్డు రద్దీగా ఉంది. కానీ ఎవరూ దీన్ని గుర్తించలేకపోయారు. క్రమంగా వీటన్నింటినీ విశ్లేషించిన పోలీసులు వెనుక సీట్లో కూర్చున్న భానునే ఈ హత్యకు పాల్పడి ఉంటాడని నిర్ధారించారు. సూరి సోమవారం ఉదయానికి బెంగళూరుకు తిరిగి వెళ్లాల్సి ఉంది. అయితే పని పూర్తి కాకపోవటంతో హైదరాబాద్లోనే ఉంటున్నానని, మంగళవారం ఉదయానికి తిరిగి వస్తానని బంధువులకు చెప్పినట్లు సమాచారం.