చంద్రబాబు భేటీకి నాగం డుమ్మా: అలకా లేక అధినేత ఫోన్ రాకా?
నాగం తెలంగాణ తెలుగుదేశం శాఖకు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగం ఆదివారం ఉదయం తెలంగాణకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో భేటీ ఆయ్యారు. అధినేతతో సాయంత్రం భేటీలో అందరూ ముక్తకంఠంతో శాఖనే డిమాండ్ చేయాలని సమన్వయ కమిటీ ఏర్పాటును వ్యతిరేకించాని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
సమైక్యాంధ్రకు మద్దతుగా ఉన్న నేతలతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే కుట్ర జరుగుతున్నందుని వారు భావించినట్టు సమాచారం. ఈ కారణంగానే కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకరరావు, రేవూరి ప్రకాశ్రెడ్డి, మహేందర్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి తదితరులు నాగం ఇంట్లో వీరంతా భేటీ అయ్యారు.
సమన్వయ కమిటీ కాకుండా శాఖకోసమే పట్టుబట్టాలని అందరూ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు రెండుకళ్ల సిద్దాంతాన్ని వదిలేస్తేనే ఇటు సీమాంధ్రలో, అటు తెలంగాణలో పార్టీకి భవిష్య్తత్తు ఉంటుందని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
వీరి భేటీ విషయమై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో నాగం ఇంట్లో ఉన్న తెలంగాణ నేతలు అందరికీ చంద్రబాబు ఫోన్ చేసి భేటీకి పిలిచారు. అయితే నాగంకు మాత్రం చంద్రబాబునుండి పిలుపు రాలేదని అందుకే ఆయన వెళ్లలేదని తెలుస్తోంది. పార్టీ తెలంగాణ శాఖకు చంద్రబాబును నాగం కోరినప్పటికీ చంద్రబాబు ఆందుకు ససేమీరా అన్నట్టు తెలుస్తోంది.
ఆ కారణంగా అలక చెందిన నాగం జనార్ధన్రెడ్డి భేటీకి వెళ్లలేదని కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ అంశం చంద్రబాబునాయుడు, నాగం జనార్ధన్రెడ్డిల మధ్య విభేదాలు పెంచుతుందని పలువురు భావిస్తున్నారు. చంద్రబాబుతో భేటీకి నాగంతో పాటు మరో ఇద్దరు ముఖ్య నాయకులు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.