చంద్రబాబుపై నాగం గుర్రు: తెలంగాణ శాఖ ఏర్పాటుకు పట్టు!
అయితే చంద్రబాబు మాత్రం వారి కోరికను వ్యతిరేకించినట్టుగా తెలుస్తోంది. ప్రత్యేక శాఖ కాకుండా తెలంగాణ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఈ విషయమై నాగంతో సహా తెలంగాణ సీనియర్లు ఆయన చాలా గుర్రుగా ఉన్నట్టున్నారు. అంతేకాకుండా తెలంగాణలోని సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్న నేతలతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారని కూడా సమాచారం.
దీంతో నాగం, ఎర్రబెల్లి, కడియం తదితరులు చంద్రబాబు తీరుపై గుర్రుగా ఉన్నారు. ఈ కారణంగా ఆదివారం చంద్రబాబు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసే సమావేశంలో వారు పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వారు వేరుగా నాగం ఇంట్లో భేటీ అవనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ శాఖకు ఓకే అంటేనే సరి అని లేదంటే తెలంగాణలో తెలుగుదేశం కనుమరుగు ఖాయం కావడం తథ్యమని వారు భావిస్తున్నారు.
గత ఉప ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంది. ఆ సమయంలో పోటీ తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్కు మధ్య ఉండటంతో చంద్రబాబు బాబ్లీ ఉద్యమం చేశారు. అయితే చంద్రబాబు బాబ్లీ ఉద్యమానికి ప్రజల్లో సానుభూతి లభించినప్పటికీ అది తెలంగాణ సెంటిమెంటు ముందు నిలబడ లేక పోయింది. ఈ కారణంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ధరావత్తు కూడా దక్కించుకోలేని పరిస్థితికి దిగజారింది.
చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం కారణంగా ఇటు సీమాంధ్రలో అటు తెలంగాణలోనూ ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్మె పరిస్థితి లేదని పలువురు సీనియర్ నాయకులే ఆవేదనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే తెలంగాణలో అయితే ఎవరూ నమ్మే పరిస్థితి లేక పోవటంతో ప్రత్యేక శాఖ ఏర్పాటే కావాలని తెలంగాణ నేతలు పట్టుబడుతున్నారు.