ఓయు ఘటనలతో చిక్కుల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు
ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు చిక్కుల్లో పడ్డారు. విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యంపై అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలనే మిగిలిన పార్టీ వారు తప్పు పడుతున్నారు. నల్గొండ జిల్లాలోని సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం భారీ సంఖ్యలో తెలంగాణవాదులు ముట్టడించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చిక్కుల్లో పడ్డ ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, హోంమంత్రి సబితారెడ్డి చుట్టూ తిరుగుతున్నారు.
ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులపై దాష్టీకాన్ని ఆపాలని ఎంపీ మంద జగన్నాథం శుక్రవారం డిమాండ్ చేశారు. చదువుకుంటున్న విద్యార్థులపై లాఠీఛార్జీని, కాల్పులను ఆయన తీవ్రంగా ఖండించారు. మీడియాపై కూడా యూనివర్శిటీలో ఆంక్షలు ఉన్నాయని వాటిని తొలగించాలని ముఖ్యమంత్రిని, హోంమంత్రిని కోరతామన్నారు. యూనివర్శిటీలో ఉన్న విద్యార్థులను సంక్రాంతి సెలవుల పేరుతో క్యాంపస్ నుండి బయటకు పంపించాలని చూస్తున్నారని అది సబబు కాదని ఆయన అన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టే చర్యలకు ప్రభుత్వం పూనుకోకూడదని తాము ముఖ్యమంత్రిని, హోంమంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు.