తెలంగాణలో వైయస్ జగన్కు శాసనసభ్యుల బలమెంత?
కాగా, సుధీర్ రెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి వంటి శాసనసభ్యులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి యువ మంత్రులు వైయస్సార్ అభిమానులే. ఇలా ఇంకా కొంత మంది వైయస్సార్ అభిమానులు ఉన్నారు. అయితే, వారు నేరుగా వైయస్ జగన్కు మద్దతు తెలపడానికి వెనకాడుతున్నారు. మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ తొలుత వైయస్ జగన్కు మద్దతుగా మాట్లాడినా ఆ తర్వాత వెనక్కి తగ్గారు. తెలంగాణ అంశం వైయస్ జగన్కు తెలంగాణలో పెద్ద ఆటంకంగా మారింది. తమ ప్రాంత ప్రజాప్రతినిధులు వైయస్ జగన్ వెంట వెళ్తే తెలంగాణ ప్రజలు సహించే స్థితిలో లేరు. అంతగా తెలంగాణ ఉద్యమం పాతుకుపోయి ఉంది. దీంతో చాలా మంది శాసనసభ్యులు నేరుగా జగన్కు మద్దతు తెలపడానికి ముందుకు రావడం లేదని అంటున్నారు. లోలోపల మాత్రం వైయస్ జగన్ మద్దతుదారులు ఉన్నారని అంటున్నారు. అవసరం వస్తే వారు వైయస్ జగన్కు మద్దతు తెలవచ్చుననే మాట కూడా వినిపిస్తోంది. అయితే, తెలంగాణలో నాయకులకు కాకుండా సంప్రదాయబద్దంగా కాంగ్రెసుకు, ఇందిరా గాంధీ కుటుంబానికి విధేయంగా ఉండే నాయకులే ఎక్కువ. దీంతో వైయస్ జగన్ తెలంగాణలో పాగా వేయడం కష్టమే.
తెలంగాణ ప్రజల మద్దతు సంపాదించడానికి వైయస్ జగన్ కొత్త ఎత్తుగడను అనుసరిస్తున్నారు. తెలంగాణపై ఆయన వర్గం దాగుడు మూతుల ఆడుతోంది. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిందే కేంద్ర ప్రభుత్వమేనని, అందులో వైయస్ జగన్ చేయాల్సింది ఏమీ ఉండదని తాజాగా పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి మంగళవారం ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. జగన్ తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ఇస్తానంటే అడ్డుకునే స్థితిలో కూడా లేరని అంటున్నారు. దీంతో కూడా వైయస్ జగన్కు తెలంగాణ నుంచి మద్దతు లభించే అవకాశం ఉండదు.