వైయస్ జగన్ కు చెక్: నాదెండ్ల మనోహర్ తో మల్లుభట్టి విక్రమార్క భేటీ
తొలి విడత కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు కొండా సురేఖపై, తెలుగుదేశం అసమ్మతి శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. దాని పరిణామాలను గమనించిన తర్వాత మిగతా శాసనసభ్యులపై ఆలోచించాలని అనుకుంటున్నట్లు సమాచారం. సురేఖపై అనర్హత వేటు వేస్తే మిగతా శాసనసభ్యులు జగన్ వెంట వెళ్లేందుకు వెనకాడుతారా, లేదా అనేది చూడాలని కాంగ్రెసు నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో జగన్ వెంట వెళ్లిన శాసనసభ్యులపై చర్యలు తీసుకోరనే సంకేతాలు పార్టీ నాయకులకు, క్యాడర్కు వెళ్తే ప్రమాదమని భావించింది. దాన్ని నివారించడానికైనా, పార్టీ అధిష్టానం సీరియస్గా ఉందని చెప్పడానికి సురేఖపై అనర్హత వేటు వేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు శాసనసభ్యురాలైన సురేఖపైనే తీసుకునే కన్నా ప్రసన్నకుమార్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకుంటే నిష్పక్షపాతంగా వ్యవహరించినట్లు ఉంటుందని అనిపించవచ్చునని అంటున్నారు.