మద్దెల చెర్వు సూరి హత్య: ఉత్తరప్రదేశ్లో భాను కిరణ్, మన్మోహన్?
సూరి హత్య తర్వాత రాష్ట్రాన్ని వదిలి పారిపోయిన భానుకిరణ్ పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు మన్మోహన్సింగ్ను నమ్మారు. మన్మోహన్ ఎలా చెబితే అలా వింటున్నట్లు పోలీసులకు సమాచారం లభించింది. ఝాన్సీ, ఇటార్సీలలో మన్మోహన్ సింగ్కు బంధువులు ఉండడంతో భానును ఆ రెండింటిలో సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. భానుకిరణ్ గతంలో మన్మోహన్ సాయంతో బీహార్, ఉత్తరప్రదేశ్ల నుంచి పిస్టళ్లు, రివాల్వర్లు తెప్పించి ఇక్కడ అవసరమైన వారికి విక్రయించేవారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న అధికారులు నిందితులు కచ్చితంగా ఝాన్సీ లేదా ఇటార్సీ వెళ్లుంటారని భావిస్తున్నారు.
సూరి హత్యకేసును పరిశోధిస్తున్న పోలీసులకు సూరి, భానులకు సంబంధించిన మరిన్ని బినామీ ఆస్తుల వివరాలు లభించినట్టు విశ్వసనీయ సమాచారం. బంజారాహిల్స్లో రెండు అపార్టుమెంట్లు, జూబ్లీహిల్స్లో 10 ఖాళీ స్థలాలు వీరి ఆధీనంలో ఉన్నట్టు గుర్తించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఉన్న స్థిరాస్తులు నాలుగేళ్ల క్రితం కొనుగోలు చేసినట్లు పత్రాల్లో ఉన్నాయి. టైటిల్డీడ్స్లో కొన్నింట్లో భానుకిరణ్ పేరు, మరికొన్నింట్లో మద్దెలచెర్వు సూరి పేరు ఉండడంతో రిజిస్ట్రేషన్ పత్రాల్లో మిగిలిన వారి వివరాలను సేకరించి వారితో మాట్లాడుతున్నారు. వీటిని కొందరు సినీ ప్రముఖులు, ఇద్దరు రాయలసీమ రియల్టర్ల సహకారంతో కొనుగోలు చేసినట్టు తెలిసింది. దీంతోపాటు రంగారెడ్డి జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఆస్తులు ఉన్నట్టు సమాచారం ఉన్నా ఆధారాలు లభించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.