జగన్ వర్గం పీఆర్పీ ఎమ్మెల్యేల వేటుపై చిరంజీవి ఊగిసలాట
అయితే జగన్ వెంట వెళుతున్న ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలనే నిర్ణయానికి అంతిమంగా వచ్చినట్టు తెలుస్తోంది. షోకాజ్ నోటీసులు ఇవ్వడం కేవలం మిగిలిన వారిని భయపెట్టే ఉద్దేశ్యంతో పార్టీని కాపాడుకోవడానికా లేదా నిజంగానే చర్యలు తీసుకోవడానికా చూడాలి. నోటీసులు ఇచ్చిన అనంతరం వారి వాదనలు విని వారిపై పార్టీ ఫిరాయింపులను ఉపయోగించి చర్యలు తీసుకునే విధంగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని పిఏసిలో చర్చించడానికి సిద్ధపడ్డట్టు తెలుస్తోంది. పార్టీలోని వారంతా వారిపై చర్యలు తీసుకోవాలని కోరితే చిరంజీవి ముందుకు వెళ్లవచ్చని తెలుస్తోంది.
పార్టీ చర్యలకు పూనుకుంటే శోభానాగిరెడ్డి, కాటసానిలు పార్టీ మాజీ మహిళా అధ్యక్షురాలు శోభారాణి, వాసిరెడ్డి పద్మల విషయాన్ని ముందుకు తీసుకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. శోభారాణి, పద్మలు గతంలో పార్టీ కట్టుబాట్లను ధిక్కరించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయాన్నే ఎమ్మెల్యేలు ప్రశ్నించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ప్రజారాజ్యం ఇష్టారాజ్యంగా మారడానికి కారణం చిరంజీవే అనే వారూ ఉన్నారు. పార్టీలో ఉంటూ పార్టీని ధిక్కరించిన వారిపై చిరంజీవి నాన్చుడు ధోరణి ప్రదర్శించడమే అందుకు కారణం అంటున్నారు. జగన్ వెంట మొదటిసారి వెళ్లినప్పుడే ఎమ్మెల్యేలకు ఘాటు హెచ్చరిక చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పార్టీలోనే పలువురు భావిస్తున్నట్టు తెలుస్తోంది.