జగన్ కు చెక్: కడప డిసిసి అధ్యక్షుడిగా వైయస్ అనుచరుడు అశోక్
అశోక్ కుమార్ వైయస్కు వీర విదేయుడు, ముఖ్య అనుచరుడు. దీంతో ఆయనను జిల్లా మంత్రులు డిఎల్ రవీంద్రారెడ్డి, అహ్మదుల్లా, వైయస్ వివేకానందరెడ్డి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రత్యేకంగా జగన్ను ఎదుర్కొనేందుకు అశోక్కుమార్ను అధ్యక్షుడిగా నియమించినట్లు సమాచారం. ఇప్పటికే సాక్ష్యాత్తూ వైయస్ సోదరుడు వివేకానంద కాంగ్రెస్ వైపు ఉండగా, ఇప్పుడు జిల్లాలో అత్యంత పట్టు ఉన్న, వైయస్ విదేయుడిగా పేరు ఉన్న అశోక్కుమార్ను పదవిలో కూర్చుండబెట్టారు. దీంతో జగన్కు ఉపపోరులో చెక్ పెట్టాలని చూస్తున్నారు. కడప జిల్లా అధ్యక్షుడిగా అశోక్కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించే సమయంలో పై నలుగురు మంత్రులు గురువారం హాజరయ్యారు.
పదవీ బాధ్యతల వేదికగా వారు జగన్ ఎదుర్కొనే వ్యూహాన్ని రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. వైయస్ వివేకానంద రెడ్డి, అశోక్ కుమార్ ల కారణంగా జిల్లాలో పార్టీ క్యాడర్ దెబ్బతినే అవకాశం తక్కువగా ఉంటుందని వారు భావిస్తున్నారు. వివేకాకు సైతం జిల్లాలో మంచి పట్టు ఉంది. మరో ముఖ్య విషయం ఏమంటే అశోక్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్ వర్గంలోని పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపి పోవటం గమనించదగ్గ విషయం. జగన్ వర్గంవైపు వెళ్లాలని అనుకున్న స్థానిక నేతలు కూడా అశోక్కుమార్ను కలవడంతో జగన్ వర్గంలో ఆందోళన నెలకొన్నట్టు సమాచారం.