ఉద్యమం చల్లబడలేదు, అదును చూసి రుచి చూపిస్తాం: కెసిఆర్
ప్రస్తుతం ఉద్యమం చల్లబడలేదు. వెచ్చబడలేదు. ఎప్పుడు..ఎక్కడ కొట్టాలో తెలుసు. మళ్లీ పిడుగు పడుతుంది. ఉద్యమం ఆరిపోయిందని అనుకునేవాళ్లు సన్నాసులే అవుతారని చెప్పారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరూ ప్రత్యేక రాష్ట్రం మినహా మరోటి కోరుకోవడంలేదని స్పష్టం చేశారు. చంటి పిల్లల నుంచి పండుముసలి వరకు ఉద్యమంలో కదిలివస్తున్నారని చెప్పారు. ఉద్యమాన్ని గందరగోళం చేయడానికి వలసవాదులు, ఢిల్లీ పెద్దలు ప్రయత్నిస్తుంటారని, ఇలాంటి సమయంలోనే జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. పదేళ్లుగా ఉద్యమం కొనసాగుతుందని, మరో పదేళ్లయినా రాష్ట్రం కోసం కొట్టాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంతిమ విజయం ప్రజలదేనన్నారు.
'రచ్చ బండ' పేరుతో ప్రభుత్వం చేపడుతున్నది ఓ రొచ్చు కార్యక్రమమని కేసీఆర్ విమర్శించారు. ప్రజలను ప్రలోభపెట్టే చిల్లర కార్యక్రమంగా అభివర్ణించారు. రచ్చబండకు వచ్చే ప్రజాప్రతినిధులను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించి ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. చచ్చు రేషన్కార్డులు ఇస్తామని ప్రేమ ఒలకబోస్తారా అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ వస్తే మా కార్డులు, పెన్షన్లు మేం తీసుకుంటాం అని చెప్పారు. మీరు (తెలంగాణ కాంగ్రెస్ నాయకులు) చేసే దిక్కుమాలిన పనివల్ల నవ్వినవారి ముందు జారిపడ్డట్లు అవుతోందన్నారు.