వైయస్ జగన్ అడ్రస్ ఉండదు, ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే: విహెచ్
వైయస్ రాజశేఖర రెడ్డిని తాము ఒక్క మాట కూడా అనడం లేదని, తన తండ్రి పరువును వైయస్ జగనే తీస్తున్నారని ఆయన అన్నారు. వైయస్సార్ అధికారంలో ఉన్నప్పుడు వెనక ఉండే జగన్ ఇన్ని అస్తులు సంపాదించాడని, ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్నే మింగేస్తారని, ఈ విషయాలు ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. తన అస్తులపై జగన్ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ సెజ్ల ద్వారా సంపాదించాడా, మైనింగ్ ద్వారా ఆర్జించాడా, జలయజ్ఞం ద్వారా సంపాదించాడా అనే విషయాలు తేలాలని ఆయన అన్నారు. వైయస్ జగన్ ఆస్తులు ఎలా సంపాదించాడో తేల్చేందుకు విచారణ జరిపించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చొరవ చూపాలని ఆయన కోరారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంపై కూడా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. వైయస్ జగన్ ఆస్తులు ఎలా సంపాదించాడనే వాస్తవాలు ప్రజలకు తెలియాల్సి ఉందని ఆయన అన్నారు.
జగన్ ముఖ్యమంత్రి అవుతారో లేదో దేవుడికే తెలుసనని, అయితే జగన్ ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకం తనకు లేదని, వైయస్ జగన్ ఆలోచనేమిటో ప్రజలకు తెలుసునని, అధికారంలో కోసం తహతహలాడుతున్నారని, సాధ్యమైనంత త్వరగా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. అంతగా పదవీవ్యామోహంతో తహతహలాడుతున్న వైయస్ జగన్ ప్రజలకు సేవ చేస్తారంటే ఎవరూ నమ్మరని ఆయన అన్నారు. జగన్ను రాజీవ్ గాంధీతో పోల్చడం సరి కాదని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిందని, జగన్ కుటుంబం ఏమీ చేయలేదని ఆయన అన్నారు. జగన్ వెంట వెళ్తున్నవారు వాస్తవాలు గ్రహించి వెనక్కి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.