పరిటాల నిందితులను చంపేస్తున్నారు, భాను బతికున్నాడో లేదో: చంద్రబాబు
పరిటాల హత్య కేసులో జగన్ నిందితుడిగా ఉండటంతో తాను ఆయనను రక్షించానని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారన్నారు. పరిటాల హత్యలో వైఎస్, జగన్ హస్తం ఉన్నదని తాము అప్పడే చెప్పినట్టు చెప్పారు. జగన్లాంటి నిందితుడిని రక్షించడానికి ముఖ్యమంత్రి కిరణ్ చీఫ్ విప్గా ఉన్నప్పుడు 60 రోజుల పాటు కేసును స్టడీ చేసి జగన్ను తప్పించిన విషయాన్ని ఆయనే ఒప్పుకున్నారన్నారు. నిందితుడిని రక్షించిన కిరణ్ కూడా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడానికి ఏమాత్రం అర్హుడు కాదన్నారు. పరిటాల హత్య కేసుపై మళ్లీ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డుగా పెట్టకొని లక్షలకోట్లు రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. వాటిని బయటకు తీసి జనాలకు పంచితే ఒక్కో వ్యక్తికి రెండు లక్షల రూపాయలు వస్తుందన్నారు. అక్రమంగా దాచిన సొమ్మును స్విస్ బ్యాంకులలో దాచుకున్నారన్నారు. వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని దొంగలమాదిరిగా దోచుకుందన్నారు. నల్లడబ్బును తెప్పించడానికి ప్రణబ్ కూడా చేతులెత్తేశారన్నారు. ఇది సరికాదన్నారు. స్విస్ బ్యాంకులోని నల్ల డబ్బును వెంటనే తెప్పించాలన్నారు.