వివాహేతర సంబంధం కథనంతో ప్రాణం తీసిన ఛానల్: బంధువుల ఆరోపణ
దీంతో సన్యాసినాయుడు భార్య, బంధువులు ఛానల్పై, ఛానల్ను ఆశ్రయించిన వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా కథనాలు ప్రసారం చేశారని ఆరోపించారు. సన్యాసినాయుడు అనకాపల్లి గుండాలవీధి నివాసి. అనకాపల్లి మండలం తుమ్మపాల అన్నపూర్ణ పీఏసీఎస్లో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు పిల్లలు. కొద్దికాలంగా చోడవరం మండలం గోవాడకు చెందిన నర్సమ్మ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందని ఓ చానల్లో రెండురోజుల క్రితం కథనం ప్రసారమైంది.
నాయుడు తనను మోసం చేశాడంటూ నర్సమ్మ ఓ చానల్ను ఆశ్రయించింది. సదరు చానల్ నర్సమ్మ తరపున వకాల్తా తీసుకుని లైవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. నాయుడు ఫొటోలతో పాటు కుటుంబ సభ్యుల ఫొటోలనూ ఆ చానల్లో ప్రసారం చేశారు. దీంతో మనస్తాపం చెందిన నాయుడు శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీస్స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యకు యత్నించాడు. ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతడు మృతిచెందాడు. దీంతో నాయుడు బంధువులు, స్థానికులు అనకాపల్లి పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
చానల్కు చెందిన స్థానిక రిపోర్టర్, గూండాలతో కలిసి నాయుడిని నర్సమ్మ డబ్బులు డిమాండ్ చేసిందని ఇవ్వకపోవడంతో టీవీలో తప్పుడు కథనాలను ప్రసారం చేశారని ఆరోపించారు. వారి వద్దకు స్థానిక డీఎస్పీ రమణారావు చేరుకుని.. కేసు విచారణ తరువాత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తన భర్త మరణానికి సదరు టీవీ చానల్ ప్రతినిధితో పాటు దాడి నాగు, నర్సమ్మలే కారణమంటూ మృతుడి భార్య సుధాలక్ష్మి పోలీసులకు తెలిపింది.
నర్సమ్మ అనే మహిళ తమ ఇంటికి వచ్చి అల్లరి పెడుతోందని.. ఆమెపై చర్య తీసుకోవాలని గత ఏడాది అక్టోబర్ 22న అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సుధాలక్ష్మి పేర్కొంది. తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోనందునే తన భర్త మరణించాడని ఆమె వాపోయింది. ఈ నేపథ్యంలో నాయుడు ఆత్మహత్య కేసులో నర్సమ్మను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.