అవమానం భరించలేకనే సూరిని హత్య చేసిన భాను కిరణ్?
మాదాపూర్ నుంచి బంజారాహిల్స్ వెళ్లేలోపు జనసంచారం లేని ప్రాంతంలో ఎక్కడో ఒక్క చోట పథకాన్ని అమలు చేస్తానని, కారుతో కూకట్పల్లిలో ఫలానాచోట ఉండాలంటూ భాను చెప్పాడని మన్మోహన్సింగ్ వివరించాడు. సూరి హత్యజరిగిన రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి భాను, సుబ్బయ్యల మధ్య ఫోన్ సంభాషణలు లేవని, సంక్షిప్త సందేశాల ద్వారానే వీరు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నారని, ఫోన్లో మాట్లాడితే సూరికి అనుమానం వస్తుందన్న భావనతో భాను ఈ జాగ్రత్త తీసుకున్నాడుని అంటున్నారు. మాదాపూర్లో అలేఖ్య అపార్ట్మెంట్ నుంచి కారులో బయలుదేరిన కొద్ది నిముషాలకే తాను ఎక్కడున్నది, ఎలా ఉన్నది ఎస్ఎంఎస్ల ద్వారా సుబ్బయ్యకు తెలిపాడు.
తెలిసిన వివరాల ప్రకారం - పథకాన్ని ఎక్కడైతే అమలు చేస్తే బావుటుందని సంక్షిప్త సందేశాల ద్వారా మాట్లాడుకున్నారు. కారును వెంబడిస్తున్న సుబ్బయ్య, హరిలు కొంచెం ముందుకు వెళ్లి బంజారాహిల్స్లో సూరిని చంపితే అనుమానం రాదంటూ సంక్షిప్త సందేశాన్ని పంపారు. దాన్ని పరిశీలించిన తర్వాత భాను సూరిని పదిహేను నిముషాల్లో కాల్చిచంపాడు. బయటకు వచ్చిన తర్వాత మన్మోహన్సింగ్ను కలవగా కారు లేదని చెప్పడంతో లోక్నాథ్కు ఫోన్ చేసి కారు తెమ్మన్నారు. కూకట్పల్లి నుంచి కారులో షోలాపూర్ వరకూ వెళ్లామని మన్మోహన్సింగ్, సుబ్బయ్యలు పోలీసుల వద్ద అంగీకరించారు. షోలాపూర్ వెళ్లిన తర్వాత భాను తమను వెళ్లిపొమ్మన్నాడని, భయంతో అతడి వెంటే ఉండిపోయామని వివరించారు.