తెలంగాణకు సంకీర్ణమే అడ్డు: డిఎంకే, ఎన్సీపీ, తృణమూల్ వ్యతిరేకం?
కేంద్రంలో యూపిఏ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నందువల్లనే తెలంగాణ ఉద్యమం ఇంత భారీ ఎత్తున జరుగుతున్నప్పటికీ కేంద్రం నాన్చుతున్నట్టుగా భావిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే దేశంలో మరిన్ని ప్రత్యేక వాదాలు బయటకు వస్తాయని యూపిఏ భాగస్వామ్యంలోని పలు పార్టీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ నుండి బుందేల్ఖండ్, మహారాష్ట్ర నుండి విదర్భ, తమిళనాడునుండి కూడా ఇప్పటికే వస్తున్న ప్రత్యేక వాదనలకు మరింత బలం చేకూరుతుందని ఆయా రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్పై ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది.
యూపిఏ ప్రభుత్వంలో ఉన్న డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ ప్రకటించిన నేపథ్యంలో తాము యూపిఏ నుండి విరమించుకునేందుకు కూడా వారు సిద్దంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ బెట్టుకు పోయి తెలంగాణ ప్రకటిస్తే తమిళనాడునుండి కరుణానిధి, మహారాష్ట్రనుండి శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ నుండి మమతా బెనర్జీ తదితరులు యూపీఏకు మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని జాప్యం చేయడానికి చూస్తున్నట్టుగా తెలుస్తోంది.