ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయం వీసా ఫ్రాడ్కు కేంద్రం హైదరాబాద్?
వీసా ఫ్రాడ్ ఆరోపణలపై విశ్వవిద్యాలయం నెల రోజుల క్రితం మూత పడిన విషయం తెలిసిందే. ఈ విశ్వవిద్యాలయంలో భారతీయ విద్యార్థులు, అందులోనూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎక్కువ మంది చేరడానికి కారణం కూడా అదే కావచ్చు. అక్రమాలకు కారణమైన ఇద్దరిలో భారత సంతతికి చెందిన ఉద్యోగి రాజిరెడ్డి కారణమని ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు సుసాన్ సూ అన్నారు.
తమ విశ్వవిద్యాలయంలోని అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలోని స్టూడెంట్ అసిస్టెంట్ అంజిరెడ్డి, మరో విద్యార్థి రామ్ క్రిష్టా కర్రాతో కుమ్మక్కయి అక్రమాలకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. ఐసిఇ చర్యల కన్నా ముందే ఈ ఇద్దరిని తొలిగించినట్లు కూడా ఆయన తెలిపారు. రాజిరెడ్డి బహుశా హైదరాబాదుకు చెందిన వ్యక్తి కావచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయానికి దక్షిణాసియా ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న రెండు సంస్థలు హైదరాబాదులో ఉన్నాయి. ఒక్కటి వనస్థలిపురంలో ఉన్న ఎబిఎస్ కన్సల్టెన్సీ కాగా, మరోటి నారాయణగుడాలో ఉన్న ఎల్ఎఇసి కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఆ తెలుగు టీవీ చానెల్ తెలిపింది.
కన్సల్టెంట్ సంస్థలు హైదరాబాదుకు చెందినవి కావడంతో రాజిరెడ్డి సహకారంతో తెలుగు విద్యార్థులు ట్రైవ్యాలీలో ఎక్కువ మంది విద్యార్థులు చేరి ఉంటారని భావిస్తున్నారు. వీసాలు సక్రమంగా రావడంతో ఆ సంస్థలను నమ్మి తాము విశ్వవిద్యాలయంలో చేరామని విద్యార్థులు అంటున్నారు. విద్యార్థులకు రేడియా ట్యాగింగ్ పెద్ద సమస్యగా మారింది. విశ్వవిద్యాలయంలో ఒక గది తప్ప ఏ సదుపాయాలు లేకపోవడంతో తాము బదిలీకి సర్టిఫికెట్ కోరామని, అయితే అక్కడి మహిళా అధికారి తమను మాట్లాడనిచ్చేది కాదని, తిట్టి బయటకు పంపించేదని విద్యార్థులు అంటున్నారు.