వరంగల్, కరీంనగర్ బంద్, ఉద్రిక్తం: సిఎం రావద్దంటూ నినాదాలు
ముఖ్యమంత్రి రచ్చబండను ఎవరూ ఆమోదించడం లేదని వారు ఆరోపించారు. బలవంతంగా గ్రామస్తులను కార్యక్రమానికి తీసుకు వెళుతున్నారన్నారు. ఆయా గ్రామాలను పోలీసు క్యాంపులుగా మార్చారని దుయ్యబట్టారు. పూర్తిగా పోలీసు బందోబస్తు మధ్య కార్యక్రమం ఏర్పాటు చేయడాన్ని వారు ప్రశ్నించారు. సిఎం పర్యటించే గ్రామాల్లో 144వ సెక్షన్ పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయం చెప్పిన తర్వాతే రావాలని హెచ్చరించారు. సిఎం రచ్చబండ కార్యక్రమం నేపథ్యంలో వరంగల్ ఎమ్మెల్యే వినయభాస్కర్ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. అయితే ఎమ్మెల్యే తప్పించుకొని వచ్చి కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
కాగా మంత్రి బస్వరాజు సారయ్య రచ్చబండను అడ్డుకోవడాన్ని ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ఖచ్చితంగా ఇస్తుందని చెప్పారు. అయితే కొందరు రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రితో రచ్చబండలో తెలంగాణ తీర్మానం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమాన్ని ఎవరూ అడ్డుకోవద్దని సూచించారు. మహబూబాబాద్ ఘటన పునరావృతం కాదన్నారు. కాగా పలువురు తెలంగాణవాదులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.