చిరంజీవి కాంగ్రెసులో ఓ రెట్ట, అల్లు అరవింద్ కంపెనీలా మార్చాడు: జోగయ్య
పార్టీని అల్లు అరవింద్ ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీగా నడిపారే తప్ప ఏనాడైనా తనలాంటి సీనియర్ల సలహాలు తీసుకున్నారా? అని లేఖలో ప్రశ్నించారు. సామాజిక న్యాయం కోసం పాటుపడతారని భావించి సంవత్సరంముందే ఎంపీ పదవిని వదులుకొని పీఆర్పీలోకి వచ్చిన తనపై ఆరోపణలు చేయటంతోనే చిరంజీవి సంస్కారమేమిటో అర్థమవుతోందని విమర్శించారు. తన భార్య చనిపోయిన దు:ఖంలో ఉండి కూడా 20 రోజులు పాలకొల్లులో ఉండి ఊరూరా తిరిగి ప్రచారం చేసినా చిరంజీవి ఐదువేల ఓట్లతో ఓడిపోయారని చెప్పారు.
తానే కనుక పనిచేయకపోతే 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోయేవారని చెప్పారు. తిరుపతి మీటింగు నాటికి పార్టీకి ఉన్న రేటింగు, ఎన్నికలనాటికి పడిపోయి కేవలం 18 సీట్లకు పడిపోవటానికి కారణం చిరంజీవి చేతకానితనం కాదా అని ప్రశ్నించారు. మీరేదో ఉద్దరిస్తారనుకుని నమ్ముకుని వచ్చిన వారిని నట్టేటముంచి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. సరైన వేదిక దొరికితే మరిన్ని విషయాలు బయటపెడతానని జోగయ్య తెలిపారు. పాలకొల్లు నుంచి తాను పోటీ చేసి ఉంటే గెలిచి ఉండేవాడినని ఆయన అన్నారు.