తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణ అవాంఛనీయం: మనీష్ తివారీ
శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. తెలంగాణపై ఒక నిర్ణయం తీసుకునే సమయంలో సహాయ నిరాకరణ వంటి కార్యక్రమాలు చేపట్టడం సరైంది కాదని ఆయన అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో యుపిఎ ప్రభుత్వమే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ఆయన చెప్పారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకునేటప్పుడు దానికి అడ్డు తగలడం మంచిది కాదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న తర్వాత కార్యక్రమాలు చేపట్టవచ్చునని ఆయన అన్నారు.
మనీష్ తివారీ ప్రకటనను తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ హైదరాబాదులో వ్యతిరేకించారు. మాట వరుసకు మాత్రమే మనీష్ తివారీ మాట్లాడుతున్నారని, చర్యలు తీసుకుంటామని ఎన్ని సార్లు చెప్తారని ఆయన అన్నారు. సహాయ నిరాకరణ వల్ల ప్రభుత్వం భయపడుతుందని అనుకోవడం లేదని, అయితే స్పందించాల్సిన అనివార్యతలో మాత్రం పడిందని ఆయన అన్నారు. మనీష్ తివారీ ప్రకటనలో కొత్తేమీ లేదని, అటువంటప్పుడ ప్రకటనలు ఎన్నాళ్లు చేస్తారని ఆయన అన్నారు.