దాడిపై నేను ఫిర్యాదు చేయలేదు, చేయను: జయప్రకాష్ నారాయణ
తెలంగాణ ప్రజల హక్కుల కోసం, వనరుల కోసం తాము మొదటి నుంచీ పోరాడుతున్నామని ఆయన చెప్పారు. తాము ఈ విషయాన్ని ఆచరణలో కూడా చూపిస్తున్నామని ఆయన చెప్పారు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని అడ్డుకోలేరని, స్వేచ్ఛను అరికట్టలేరని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రమే కావాలంటే సామరస్యపూర్వకంగా, శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా పోరాటాలు చేయవచ్చునని, కానీ ఇటువంటి పద్ధతి సరికాదని ఆయన అన్నారు. తనను పరామర్శించిన నేతలకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై జరిగిన దాడికి నిరసనను శాంతియుత పద్ధతుల్లో, పరుష పదజాలం వాడుకుండా తెలియజేయాలని ఆయన కోరారు.
అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ ఇతరుల హక్కును కూడా పరిరక్షించాలని ఆయన సూచించారు. మనసులోని అధర్మప్రవృత్తి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తుందని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ధర్మబద్దంగా తాము వ్యవహరిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ రోజు జరిగిన సంఘటనలాంటివి దేశంలో జరుగుతూనే ఉన్నాయని, అవి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా పరిణమించాయని ఆయన అన్నారు. రాజధాని మారినంత మాత్రాన ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందా అని ఆయన అడిగారు.