సోనియా గాంధీతో వైయస్ వివేకానంద రహస్య భేటీ, తెలంగాణ భయంతోనే
కడప పార్లమెంటు సీటుకు కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా తన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని నిలబెట్టేందుకు సోనియా గాంధీ నిర్ణయం సంపాదించడానికి వైయస్ వివేకానంద రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించేందుకు, ఉప ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ఆయన సోనియాతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తాను కడప నుంచి పోటీ చేస్తానని నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
తెలంగాణపై ప్రకటన చేయాలని పట్టుబట్టేందుకు కొద్ది రోజులుగా కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో మకాం వేశారు. వారు కాంగ్రెసు కోర్ కమిటీకి చెందిన నాయకులతో సమావేశమవుతున్నారు. అయినా, తెలంగాణకు అనుకూలంగా వారికి ఏ విధమైన స్పందనలు లభించడం లేదు. సోనియాను కలిసేందుకు వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే వారికి సోనియా అపాయింట్మెంట్ లభించడం లేదు. వారిని కలుసుకోకుండా వైయస్ వివేకానంద రెడ్డితో సమావేశమైతే విమర్శలు వస్తాయని భయపడి ఆమె రహస్యంగా వివేకానంద రెడ్డితో సమావేశమైనట్లు చెబుతున్నారు. సోనియాతో సమావేశమైన తర్వాతనే వివేకానంద రెడ్డి హైదరాబాదుకు తిరిగి వచ్చినట్లు సమాచారం.