గవర్నర్కు కొనసాగే హక్కు లేదు: టిడిపి నేత నాగం జనార్ధన్ రెడ్డి
శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ నక్సలిజం కనిపించిందని ప్రశ్నించారు. నక్సలిజం ఉందని గవర్నర్ చెప్పారు, పోలీసు అధికారి చెప్పారు లేక సీమాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి చెప్పారా అని ప్రశ్నించారు. ఎనిమిదో చాప్టర్ను వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కమిటీ వేసిందే నివేదిక సారాంశం తెలుసుకోవడానికి కాదా అని ప్రశ్నించారు.
తెలంగాణ వ్యతిరేకి అయిన ఈ గవర్నర్కు కొనసాగే హక్కు లేదన్నారు. తెలంగాణకోసం పోరాడుతున్న వారిని ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. వారి సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సస్పెన్షన్తో తెలంగాణను అడ్డుకోలేరన్నారు. సస్పెన్షన్పై త్వరలో భేటీ అవుతామన్నారు. మేం కూడా సస్పెన్షన్ కావడానికి సిద్ధపడతామని చెప్పారు. 56 సంవత్సరాలుగా ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందన్నారు.
ఇది వరకు జీరో అవర్లో ప్రశ్నలు వేస్తే దానికి సమాధానం చెప్పే వారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఇటీవల అసెంబ్లీలో చర్చలకే ఆస్కారం లేదన్నారు. ప్రభుత్వం ఇలా ఉంటే ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయే పరిస్థితి ఉందన్నారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ సరిగా లేవన్నారు. శుక్రవారం నాటి దృశ్యాలు కావాలనే ప్రభుత్వం లీక్ చేసిందన్నారు.
గవర్నర్ నరసింహన్పై సృష్టించిన దౌర్జన్యాన్ని నేను సమర్థించడం లేదని అయితే వాటిని మీడియాకు లీక్ చేయడం కూడా తప్పు అన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని అనుకుంటే సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. శాసనసభా నిర్వహణపై చాలాసార్లు లేఖలు రాశానని చెప్పారు. జీరో అవర్లో మంత్రులు సమాధానాలు ఇవ్వడం లేదన్నారు. రంగరాజన్ గవర్నర్గా ఉన్నప్పుడు చాలా గొడవలు జరిగాయన్నారు. సభాపతి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. కాంగ్రెస్ సభను తనకు అనుకూలంగా నిర్వహించుకుంటుందన్నారు.